Friday, March 18, 2011

హోలీ ...రంగుల పండగ




రేపే హోలీ.  మొన్నెప్పుడో దారిలో ఓ మోదుగ పూల చెట్టు విరగబూసి,  చెట్టు మీద ఒక్క ఆకు లేకుండా  కనిపించింది. అది చూశాక చిన్నప్పటి హోలీ జ్ఞాపకాలు మదిలో ముసురుకున్నాయి.  అప్పుడు ఏమీ  తెలియని వయస్సు, హోలీ  అంటే రంగులు తయారు చేసుకోవడం,  స్నేహితులంతా కలిసి ఆ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వూళ్ళో ఆడుకోవడం. ముందు  రోజే ఎర్రటి మోదుగు పూలచెట్లను  తోటల్లో , రోడ్ల పక్కన వెతికి పట్టుకొని పూలన్నీ తెమ్పుకొని, ఆ రోజు సాయంత్రం ఓ కుండలో నీళ్ళు పోసి ఆ పూలను ఉడికిస్తే ఎర్రటి రంగు ద్రావణం తయారయ్యేది.  అదే మాకు హోలీ రంగు. దీంతో పాటు కుంకుమ, ఒక్కోసారి అత్యుత్సాహం గల కొందరు మిత్రులు వాడే ఎడ్ల బండ్ల ఇర్సులులకు వాడే నల్లటి రంగు. కొంత మంది కోడి గుడ్లను కూడా ఉపయోగించే వాళ్ళు.  ఇంకా ఉత్సాహం పెరిగితే ఇంటి ముందు గోలెం లో ఉండే కుడితి లో ముచే వాళ్ళు. తెల్లవారి పొద్దున్నే లేచి రంగులు సీసాల్లో నింపుకొని, వూళ్ళో తెలిసిన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళడం, రంగులు పోయడం. కొందరు బయపడి పోయి డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు అనుకోండి. అలా మద్యహ్న్నం వరకు ఆడి అందరం కల్సి చెరువుకో, పక్కనున్న కాల్వకో పోయి స్నానం చేసి వచ్చేవాళ్ళం. భలే సరదాగా ఉండేది. ఇప్పుడో  రంగు పూసుకోవాలంటే భయం , కళ్ళల్లో పడితే ఏమవుతుందో, నోట్లో కి వెళ్తే ఏమవుతుందో అని.  ఆ  ఎర్రటి మోదుగ పూల రంగు ముందు ఇవన్నీ  దిగదుడుపే. 

Friday, March 11, 2011

మూడు ఉత్తరాలు



రేడియో  డైరక్టర్ గా వున్న రజనీకాంత రావు గారు ఓ మాట అనేవారట. " కవులూ కథకులూ, రచయితలూ....వీల్లున్నారే...వీళ్ళకి మేం సాయం చేయటం లేదు. వాళ్లే మాకు సాయం చేస్తున్నారు, మా నిర్వహణకు మంచి పేరు రావాలంటే సమర్థులయిన రచయితలూ, వారి రచనలూ...మాకు లభించాలి. అప్పుడే నార్లకు మంచి ఎడిటర్ అని, రజనీకాంత రావుకి మంచి రేడియో స్టేషన్ డైరెక్టర్ అనీ పేరు వస్తుంది.అందుకే ఎక్కడ మంచి రచయిత ఉన్నాడా?  అని ఎప్పుడూ వెతుకుతూనే వుంటాం. మా చుట్టూ ప్రదక్షిణాలు చేసే వాళ్ళతో సరిపెట్టుకోం... "   అని.  అద్బుతమయిన ప్రతిభ పాటవాలున్న రచయితలూ పత్రికాఫీసుల చుట్టూ.. రేడియో, టి.వి. స్టేషన్ల చుట్టూ తిరగరు. కనుక వారిని వెతికి పట్టుకోవాలి.   ఈ రోజుల్లో ఆ పరిస్తితులున్నాయా?  ఈ శ్రద్ద కూడా రాను రాను తగ్గిపోయింది. ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారికి ,  " భారతి" ఆఫీస్  నుండి వచ్చిన మూడు ఉత్తరాలు చూడండి.  రాను రాను రచయితల పట్ల ఆదరణ ఎలా తగ్గుతూ వచ్చిందో స్పష్టంగా అర్థం అవుతుంది.

మొదటి ఉత్తరం 1940  లో నాగేశ్వర రావు పంతులు రాసింది...." హనుమచ్చాస్త్రి గారూ! నమస్కారం...దయచేసి మీకు వీలయినప్పుడు  మంచి కథ గాని, కవిత గాని 'భారతి' కి పంపండి. పారితోషికం ముందుగా ఈ జాబు తో పంపుతున్నాను."

రెండవది 1955  లో శంబూ ప్రసాద్ గారు రాసింది- " శాస్త్రి గారూ! మాకు అప్పుడప్పుడూ ఏదయినా రచన  పంపుతూ ఉండండి."

మూడవది 1966  లో రాధాకృష్ణ గారు రాసింది- " అయ్యా ! మీరెప్పుడయినా రచన పంపిస్తే పరిశీలిస్తాం."