Wednesday, October 5, 2011

నిలువు చెంబు - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి





విశాలాంధ్ర లో ఏవో పుస్తకాలు వెతుకుతుంటే అనుకోకుండా నా చేయి తాకి ఓ పెద్దాయన క్రింద పడి పోయాడు.  అయ్యో క్షమించండీ అంటూ లేపి నా మానాన నేను పోదామని , ఎందుకైనా మంచిదని ఎవరా అని చూశా...శ్రీపాద వారు. పెద్దాయన కదా వీరితో మనకెందుకులే అని ఓ నమస్కారం పెట్టుకొన్నా. శ్రీపాద వారి గురించి విన్నవి , చదివినవి ఓ సారి మనసులో మెదిలాయి. వారి కథల నేపద్యం "గోదావరీ తీరం", పాత్రలు ఎక్కువగా శ్రోత్రీయ బ్రాహ్మణులూ అదే కాకుండా ఎక్కువగా వితంతు వివాహాలు , మూడాచార   నిరసనలు, సాంసారిక జీవితంలో మాధుర్యం, స్త్రీ స్వాతంత్రం, అంటరాని తనం మొదలగు కథా వస్తువులతో కథలు రాశాడని, భాష విషయంలో వ్యావహారిక భాషను, నుడికారానికి పట్టాభి షేకం చేసిన మహానుభావుడని అన్నీ గుర్తొచ్చాయి. ఇంత పెద్దాయన కదా ఓ సారి ఇంటికి తీసుకెళ్ళి పరిచయ భాగ్యం చేసుకుంటే ఎలా ఉంటుంది.  మనకు కొరుకుడు పడతారా లేదా అనే  అనుమానం తో ధైర్యం చేసి వారి ని తీసుకొని వారి " నిలువు చెంబు" నా చేత పట్టుకొని ఇంటికి చేరా. ఇంటికెళ్ళగానే ఆ " నిలువు చెంబులో " ఏముందో అని చూశా.  నీళ్ళు అనుకున్నా కాదు...తేనే..అమృతం   ఆ అమృతం లోని తీయదనాన్ని ఆస్వాదిస్తూ మీకు కూడా కొంత పంచుదామని ఈ చిన్న ప్రయత్నం....ఆస్వాదించండి మరి. ఈ నిలువు చెంబు లో మొత్తం 8 కథలున్నాయి.

ప్రణయ తపస్సు: వితంతు వివాహం గురించి సాగే కథ. ఓ బైరాగి నలబై  ఏళ్ల కు పైగా , తను పెళ్లి చేసుకుందామని అనుకున్న  బాల వితంతువు అనుకోని పరిణామాల వల్ల  చనిపోతే ఆమె తండ్రి ఆమెకు కట్టించిన సమాధి  మండపం పై చేసే ప్రణయ తపస్సు ఈ కథ. నలభై ఏళ్ల క్రింద జరిగిన విషయాలు ఆ బైరాగి మనకు చెప్పడమే ఈ కథ. 

కన్యాశుల్కం - వరశుల్కము: పూర్ణయ్య బిడ్డ గున్నమ్మ ను అవధాన్లు 500 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. కాపురానికి తీసుకపోయి భార్యను సనాతన భావాలతో కట్టడి చేస్తుంటాడు. గున్నమ్మ అన్న చలపతి సబిన్స్పెక్తర్. అతను అతని 500 అతనికి ఇచ్చి ,మళ్ళీ కట్నం క్రింద ఇంకో 500 ఇచ్చి సరిగా చూస్కొమ్మని గట్టిగా చెబ్తాడు. అక్కడినించి గున్నమ్మ తీరు మారుతుంది. పల్లెటూరు నుండి రాజమహేంద్రవరం మకాం మార్చి వర్తకం ప్రారంభిస్తాడు. మూడాచారాల నుండి ఆదునికత కు మారిన బ్రాహ్మణ కుటుంబ గురించి చెప్పేది ఈ కథ.
ప్రణయ భంగము: ఇది కూడ ఒక బ్రాహ్మణ బాల వితంతువు కథ. చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని భర్త ను తల్లిని కూడా పోగొట్టుకొన్న యువతి కథ. దుక్కమే   తోడూ , నీడ, జీవం, ధైర్యం,సకలం అలా రూపొందిన  దుక్కమై పోతుంది. తండ్రి వితంతువైనా సరే లోకాన్ని ఎదిరించి పెళ్లి చేస్తా అంటాడు. తనూ సంతోషించి ఎదురింట్లో  ఉన్న బ్రాహ్మన్ని కోరుకుంటుంది. అతడు భార్య చని పోయి ఒక భోగం దాని ని  ఉంచుకుంటాడు. నా శరీరం చెడిపోయింది అని ఒప్పుకోడు. తర్వాత ఈమె తండ్రి అనుమతితో అతనికి సేవ చేస్తుండగా అనుకోని పరిస్తితులలో పరిస్థితి విషమించి అతడు చనిపోతాడు. ఇంతజరిగాక సంసారం లో ఏముందని ఆ జగన్మాతని ఆశ్రయించడం ఈ కథా  సారాంశం.

వయస్సూ, బుద్దీ కూడా పెరుగుతాయి.: బాల్య వివాహాల గురించి వాటి పర్యవసానాల గురించీ చెప్పే కథ. పదహారేళ్ళు కూడా నిండని భాస్కారానికి పునస్సందానం తలపెడితే అత్త వారి ఊర్లో అందరూ అనే సూటి పోటి  మాటలు విని ఎవ్వరికి చెప్పకుండా తాను చదువుకొనే మద్రాసు కు వెళ్లి పోతాడు. అక్కడినించి ఇంకో నాలుగు , అయిదు ఏళ్ల దాక రానని ఓ ఉత్తరం ముక్క రాస్తాడు. ఊళ్ళో అందరూ ఈ వ్యవహారం గురించి ఎలా  మాట్లాడతారు , అక్కడ హెడ్మాస్టారు ఈ కార్యాన్ని వ్యతిరేకించడం మొత్తం చాల చక్కగా రాస్తారు.

నిలువు చెంబు: ఇది ఒక అపరాధ పరిశోధక కథ. పోయిన నగలని చాకచక్యంగా పట్టుకోవడం హాస్యంగా సాగే మంచి అపరాధ పరిశోధక కథ.

ఆచార్యుడు - ఆచార్యుడు: ఇది కులాంతర వివాహానికి సంబంధించిన కథ. మూడంగా వ్యతిరేకించే బ్రాహ్మల గురించి రచయితా వేరే మతాలలో   సత్యం ఉంది, దేవుడు ఉన్నాడు, ధర్మం ఉంది, వీళ్ళకి వేదం బోధ పడదు, భోధ పర్చుకోవాలని ప్రయత్నం చేయరు. హిందూ జాతి ఓ ఆచార్యుడి కొరకు ఎదురుచూస్తోంది అంటాడు.

అశ్వ  హృదయం: పంచ కల్యాణి అనే అశ్వం కథ. వర్తకుడి దగ్గర కొన్న మేలుజాతి అశ్వం. అశ్వాలను చూసుకొనే గంగడి మాటే కాదు ఎవ్వరి మాట వినదు. గంగులు బంధువు లచ్చిగాడు చెప్పినట్లు వింటుంది. అప్పటినుంచి రోజూ రాజు, లచ్చిగాడి సహాయంతో ఆ అశ్వం తో వాహ్యాళి కి వెళ్ళాల్సిందే. రోజూ దాటే కాల్వ ఒక రోజు ఎంత దాటమన్న వినదు. చివరికి లచ్చిగాడు రాజుగారి పాగా జరిగింది, చూడండి అంటాడు. అప్పుడు రాజు గారు పాగా సర్దుకున్నాక ఒక్క ఊపున కాల్వను , కాల్వ గట్టు ను దాటుతుంది. చివర్లో "ఇది జరిగింది, విన్నదీని, రచన మట్టుకు నాది" అంటాడు రచయిత. 

బుచ్చి వెంకాయమ్మ: ఇది కూడా ఒక బాల వితంతువు వివాహమే వస్తువుగా కల కథ. రెడ్డి కులానికి చెందిన ఓ బాల వితంతువు కులాన్ని , సమాజాన్ని ఎదిరించి తన చిన్నప్పడి చెలికాడినే పునర్వివాహం  అదీ వీరేశలింగం గారి సమక్షంలో చేసుకోవడం ఈ కథా సారాంశం," పురుషుని మీద ఆశ వున్నా యౌవన వితంతువు వివాహానికవకాశం ఇవ్వక పొతే ఐహిక సుఖాలని జయించలేక పోవచ్చును, తప్పుదారి చూపడం కంటే కొత్త దారీ, ఆక్షేపించడానికి వీల్లేని దారీ ఉంటె పూర్వాచారం అని ఎందుకు కుళ్ళి పోతారూ అని ప్రశ్నిస్తాడు. అలాగే శాస్త్రాలూ మారాలి, మారితే గాని మన సంఘాలు చచ్చిపోతాయి. ఇలాగే మన పెద్దలు ఇంకా బిర్ర బిగిస్తే, కొద్ది రోజుల్లోనే మన శాస్త్రాలు చూసే వాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేక నశించి పోతాయి అంటాడు.

శ్రీపాద గారు మొదటి కథ లో అన్నట్లు " అప్పటి రుచులు వెఱూ , ఇప్పటి రుచులు వెఱూను?  అప్పటి ధర్మాలు వెఱూ ఇప్పటి ధర్మాలు వెఱూను.అప్పటి యువకుల సంకల్పాలు వెఱూ ఇప్పటి వారి సంకల్పాలు వెఱూను. అప్పటికీ ఇప్పటికి ఏతాం పట్టంత తేడ వుంది. అప్పటి కథలు అర్థం చేసుకోవాలంటే ముందు హృదయాన్ని  అప్పటి కాలంలో ప్రవేశ పెట్టాలి. లేకపోతె విన్నా లాభం లేదు".


Sunday, September 4, 2011

అక్షర యాత్ర - నండూరి కి నివాళి



నండూరి రాం మోహన్ రావు గారి మరణం వార్త వినగానే, నేను చదివిన నండూరి వారి "అక్షర యాత్ర" గుర్తొచ్చింది. వారి గురించి రాసేంత వాణ్ని కాదు కానీ. నేను  చదివిన ఆ పుస్తకం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం. ఈ పుస్తకం 70  వ్యాసాల సంపుటి. వారి మాటల్లో చెప్పాలంటే " ఈ సంపుటం సుమారు అయిదు దశాబ్దాల నా అక్షరయాత్ర సింహావలోకనం. ఇందులో ఎక్కువ భాగం నేను అభిమానించే సాహితీ మూర్తులు, మిగిలిన శాతం నా అభిమాన గాయకులు , చిత్ర కారులూ, నటులు మొదలయిన వారు,  ...అన్నీ కలిపి ఈ సంకలనం ఒక పెద్ద కలగూర గంప. రక రకాల రంగు రంగుల పూల కదంబం." ఇందులోని వన్నీ పత్రిక రచనలే. " ఇది నా వైయక్తిక అభిరుచులకు, అభిమతాలకు, అభినివేశాలకు, అనుభవాల స్మృతులకు, నిలువుటద్దం  లాంటి సంకలనం అన్న నండూరి మాటలు గమనార్హం. ఈ వ్యాసాల్లో ఎన్నో రకాల వ్యక్తులు. కాదేదీ వ్యాసానికి అనర్హం అన్నంతగా  విభిన్న వస్తువులపై వ్యాసాలు రాశారు.ఇందులోని వ్యాసాలను వివిధ రకాలుగా వర్గీకరించారు, అవేంటంటే " స్మృతిపథం", "ప్రతిభా పరిమళాలు", మందార మకరందాలు, సమీక్షా సౌరభాలు, చిత్రశాల, దూర తీరాలు, వ్యాస విన్యాసం, జ్ఞ్యాపకాల నీడలు

స్మృతిపథం - ఇందులో జ్ఞ్యాపకాలకి సంబందించిన వ్యాసాలూ 17  ఉన్నాయి. దేవులపల్లి కృష్ణ  శాస్త్రి, శ్రీ శ్రీ , కొ.కు.. పాలగుమ్మి పద్మరాజు, తిలక్, మునిమాణిక్యం, గోరా శాస్త్రి మొదలయిన వారి జ్ఞ్యాపకాలున్నాయి.
ప్రతిభా పరిమళాలు- వివిధ రంగాల్లో ప్రతిభావంతులయిన వారి గురించి 12  వ్యాసాలున్నాయి.
మందార మకరందాలు- ఈ విభాగంలో కొన్ని జ్ఞ్యాపకాలు, కొన్ని ప్రశంసలూ మొత్తం 13 వ్యాసాలున్నాయి.
సమీక్షా సౌరభాలు- ఇందులో చాసో కథలు, శేషేంద్ర, వెంపటి చిన్న సత్యం మొదలగు వారి రచనలపై  5 వ్యాసాలున్నాయి.
చిత్రశాల- నాలుగు వ్యాసాలూ చలన చిత్రాలపై సమీక్షలు ఉన్నాయి.
దూర తీరాలు- ఇందులో మొత్తం 10  వ్యాసాలు పాశ్చాత్య రచయితలూ, కళాకారులపై పొందుపరచిన వ్యాసాలున్నాయి.
వ్యాస విన్యాసం- సరదా వ్యాసాలూ, పరిశీలనా వ్యాసాలూ ఓ అయిదు ఉన్నాయి.
జ్ఞ్యాపకాల నీడలు- ఆనాటి కలలేవి, మరియు కృష్ణ శాస్త్రి గారిపై రెండు వ్యాసాలున్నాయి.

పేరులోనే ఉన్నది పెన్నిధి అన్నట్లు నండూరి వారు వ్యాసాలకు పేరు పెట్టడం లోనే ఎంతో  శ్రద్ధ , నైపుణ్యం కనపరిచారు.

వ్యాసాలు ప్రారంభించడంలో, ముగింపు  చేయడంలో ఆయన చాకచక్యం గమనించండి. కృష్ణ శాస్త్రి గురించి " అది గంధర్వలోకం, ఆ లోకంలో "మధుర సుషమా సుధాగాన మంజువాటి" అందులో ఒక వియోగ గీతిక. ఆ వియోగ గీతిక పేరు దేవులపల్లి కృష్ణ శాస్త్రి అంటూ ప్రారంబిస్తారు..  శ్రీ శ్రీ గురించి ప్రారంబిస్తూ " జగమెరిగిన మహాకవికి పరిచయమేల ?  శ్రీ శ్రీ ని తెలుగు వారికి పరిచయం చేయడం సూర్యుడికి దివిటీ పట్టడం. అయనా ఇది ఒక లాంచనం, ఒక వేడుక" అని అంటారు. " వెలుగుతున్నంత సేపు తార. వెలుగు తగ్గితే ప్రమిద. ఈ మాట చలన చిత్ర నటీనటులకు వర్తిన్చినంత బాగా ఎవరికీ వర్తించదు", నాగయ్య గురించి మొదలుపెడ్తూ అన్న మాటలు. నిజమే ఈ రోజు కాంతారావు గురించి చదువుతుంటే ఇలానే అనిపించింది. ఇలానే " జీవితపు సహారాలో ఒయాసిస్సుల వంటివి సైగల్ పాటలు నాకు" అనేది ఓ ముగింపు. లత గురించి ముగిస్తూ " ఆమె వయస్సు ఇప్పుడు 23  ఏళ్ళు,ఇంకా అవివాహిత" అంటాడు. కృష్ణ శాస్త్రి గురించి రాస్తూ " విచ్చల విడిగా పెరిగిన జుట్టు, గ్లాస్గో పంచె, లాల్చీ, పల్లెవాటు, కళ్ళకు కాటుక మొదలయిన హంగులతో రంగేలిలా...." అంటుంటే మన కళ్ళ ముందు కృష్ణ శాస్త్రి ప్రత్యక్షం  కాకుండా ఉంటాడా.

ఇలా కాదేదీ వ్యాసానికి అనర్హం అన్నట్లున్న ఈ వ్యాస సంపుటి మళ్ళీ ఒక సారి చదువుతూ నండూరి కి నివాళి అర్పిస్తున్నాను.




Friday, September 2, 2011

తెలుగుకు వెలుగు


తెలుగు భాషాభిమానులకు శుభ వార్త. యునికోడ్ లో శాశ్వత సభ్యత్వం  పొందడం ద్వారా తెలుగు భాష కు అరుదయిన గౌరవం దక్కింది. దీనితో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐ.టి. దిగ్గజాల సరసన చేరింది.  ఈ సభ్యత్వం  తో ఇంటర్నెట్ తెలుగు లిపి లోని పొరపాట్లను సవరించి, యునికోడ్ లిపి ప్రమాణాలకు అనుగుణంగా కొత్త లిపిని రూపొందిస్తారు.  కొత్తగా ఆరు ఇంటర్నెట్ ఫాంట్లు  రూపొందిస్తారు. వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం కల్పిస్తారు. తెలుగులో  తెలుగు సైట్ లను వెతుక్కోవడానికి వీలుగా ఓ ప్రత్యెక బ్రౌసర్ తీసుకరావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇదే  కాకుండా తప్పులు దొర్లితే వెంటనే పసిగట్టేందుకు వీలుగా స్పెల్ చెక్ సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నారు.  తెలుగు భాష కోసం శాశ్వత ప్రమాణాలతో కూడిన కీబోర్డ్ కూడా అందుబాటులోకి రావడం మనందరికీ శుభవార్త.

Monday, August 15, 2011

హ్యాపీ మారీడ్ లైఫ్ మమ్మీ!



(ద్రాక్షారం మహాదేవ జీ గారి కవిత..ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబందం సౌజన్యం తో)

గర్భాలయం నుంచి అనల గర్భంలోకి
ట్రాన్సిషన్ భీబత్సం.....
జననక్షేత్రం దాటగానే మారణ క్షాత్రం
ట్రమాటిక్ ఎక్ష్ప్లొప్జన్ ....
నో ప్రాబ్లం.....ఇక్కడ నేను క్షేమం!

పిండం మీద యోని ముద్రలుండవు...ఫికర్ లేదు
పురిటి వాసన పసిగట్టి పోలీసు కుక్కలు రావు....రిలాక్స్
నా బొడ్డున నువ్వు మర్చిపోయిన పేగుమీద....నీ చిరునామా లేదు
బరువు దిగిన్డిగా ..మరేం భయం లేదు...స్వేచ్చగా వొళ్ళు ఆరబెట్టుకో

'నప్శియాల్ నాన్సెన్స్ ' తెలీక త్వరపద్దాను
తాళి బిళ్ళ  లేదని తెలిసీ 'అక్రమంగా' జోరబడ్డాను
తప్పు నాదే....
'ఇల్లిజిటిమెట్ బాస్టర్డ్'ని నాకిలాగే జరగాలి...నో రిగ్రెట్స్
అక్కడ నీవు క్షేమమా?!
అద్దె కట్టకుండా నీ గర్భాన్ని ఆక్రమిన్చుకున్నాను
నన్ను క్షమించు!
గర్భాదానం చేసినవాడేవడో-స్టుపిడ్
వాణ్ని మాత్రం క్షమించను
కండోం కల్చర్ లేని బ్రూట్ కు- కామకేళులెందుకో
నీ తప్పేం లేదు....అక్కడ నీవు క్షేమమా!?
అమ్మవు గదా......
ద్వేషిస్తూనే దేహాన్నిచ్చావు
బహిష్కరించినా బతక నిచ్చావు
పారేస్తే పారేశావ్-పీక నొక్కకుండా వదిలేశావ్
మెనీ మెనీ .......థాంక్స్ 
రెప్ప పాటులో రెండు జన్మలు
ట్వయిన్ బోర్న్ ....ట్వయిస్ లిబరేటేడ్
నతింగ్ సీరియస్...ఇక్కడ నేను క్షేమం!

పేపర్లో చుట్టిగదా పారేశావ్ ....వార్తనయ్యాను
ఉమ్మనీటి బుగ్గను గదా....నిప్పుకన్ను చిదిమేశాను
"దౌ ....షల్ నాట్....డై"
మైఖలాజేలో 'సృష్టి' చిత్రం మాట్లాడింది అప్పుడే
చావు నిషిద్దమయ్యింది...అప్పుడే
కర్ణుడు బతికాడు...మోషే బతికాడు....నేనూ బతికాను
తల్లిని జయించి మృత్యున్జయుడైన వాడిని
నాకిక చావు లేదు
నా కపాలాన్ని గుమ్మానికి ఉరి తీసి
గృహప్రవేశం చెయ్
హ్యాపీ మారీడ్ లైఫ్ మమ్మీ.....
సోలాంగ్....షాలోం !
 





Monday, August 8, 2011

వంశీ కవితలు



నెట్లో ఏదో వెదుకుతుంటే కనపడ్డ వంశీ కవితలు......






Sunday, July 24, 2011

నాదయిన సమస్యలు (శారద మనోగతం)


ఆలూరి భుజంగ రావ్ రాసిన "సాహిత్య బాటసారి - శారద "  లో   నేను స్వతంత్ర భారత పౌరున్ని అని భావించ లేక పోవటంలో తప్పేమీ లేదని ఎంతో వేదన తో రాసిన శారద  మనోగతం మీ కోసం ...

"నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఈ చాకిరి చేస్తూ ఇట్లా ఆలోచనలు చేస్తే తొరగా చచ్చిపోతానని, కాని హోటల్ చాకిరీ తప్పదు, చాకిరీకి తగినంత ఫలితమూ దక్కదు. పోనీ ఈ కథలు వ్రాయటం మానేద్దామా అనుకుంటాను. అదీ సాధ్యం కావటం లేదు. తెలుగు మాత్రు భాష కాకపోవటం వల్ల ఎంతో చదివితే గానీ, రచనా వ్యాసంగం సవ్యంగా సాగదు. అట్లా చదివేందుకు పుస్తకాలు కొనే ఓపికా లేదు. ఏ పున్యాత్ముడయిన  ఇస్తాడనుకుందాం. కోరిక గుర్రం కొమ్ములుగా ఉంది. ఇటీవల హోటల్ పని వాళ్లకి తెనాలి లో ఎనిమిదిగంటల పని వచ్చిందన్నారు. ఏ దారిన వచ్చిందో తెలియదు గానీ, నాతొ సహా నూటికి తొంబయి అయిదు మందిమీ పది పన్నెండు గంటల ఎద్దు చాకిరీ చేస్తూనే వున్నాం. ఈ లక్షణం లో చదువెక్కడ, రాత ఎక్కడ? ప్రభుత్వం శాసనాలు చెయ్యటం కనిపిస్తుంది కానీ, అవి అమలు జరగటం కనిపించదు. పేరుకు లేబర్ ఆఫీస్ ఉంది. ఓ లేబర్ ఆఫీసరూ ఉన్నాడు.

హోటల్ సర్వరు కి చదువు ఎందుకు అనే పెద్దమనుషులూ చాలామంది ఎదురుపడ్డారు నాకు. సరయిన గుడ్డలు నేను పుట్టింతర్వాత తొడిగి ఎరుగను. ఈ హోటల్ పనికి గ్యారంటీ  ఏమీ లేదు. ఇప్పటికి పాతికసార్లకి పయిగా ఈ ఉద్యోగం ఊడిపోవటం, రోజుల తరబడి పస్తులున్డటం జరిగింది. ఇక ముందు కూడా నా జీవితం ఇలానే ఉండబోతుంది అనడంలో సంశయమేమి లేనప్పుడు మిగిలి ఉన్న జీవిత కాలం ఎలా గడవబోతుందా అని తగని భయమేస్తుంది. స్వతంత్రం వచ్చాక  ఇట్లా ఉండదనుకున్నాను. కనీసం నా జీవిత ప్రయాణం వెనకటికన్న నూటికి ఇరవై పాల్లన్నా పెరుగుతున్దనుకున్నాను.

పత్రికల వారు  కథలు వ్రాస్తే ఇచ్చే డబ్బులు నా మూర్చల రోగాన్ని నయం చేసుకోవడానికన్న సరిపోతాయేమో అని సంతోషించాను. అదీ వట్టిదయిపోయింది. ఈ పద్దతిలో  నేను స్వతంత్ర భారత పౌరున్ని అని భావించ లేక పోవటంలో తప్పేమీ  లేదనుకుంటాను.
( ఇది :తెలుగు స్వతంత్ర లో ఫిబ్రవరి 18 , 1949 లో ప్రచురితమయ్యింది)

సాహిత్య బాట సారి - శారద (ఎస్.నటరాజన్)


ఎక్కడో తమిళ దేశం లో జన్మించి, చిన్నప్పుడే బ్రతుకు తెరువు కోసం తెనాలి వచ్చి పొట్ట నింపుకోవడానికి హోటల్ సర్వర్ గా పని చేస్తూ, తెలుగు నేర్చుకొని ఎన్నో రచనలు చేసి ౩౦ సం.ల చిన్న వయస్సులో ఫిట్స్ వ్యాధి తో మృత్యు వాత పడిన " శారద"  జీవితం గురించి ఎన్నో విషయాలు ఆనాటి తెనాలి లో శారద తో సన్నిహితంగా ఉన్న సహచరుడయిన శ్రీ ఆలూరి భుజంగ రావ్ గారు "సాహిత్య బాట సారి - శారద (ఎస్.నటరాజన్)" స్మృతి శకలాలు పేరిట మనకందించారు.ఎందరో తమ కీర్తి, తమ రచనకు ప్రాచుర్యమూ కలగాలన్న కోరికతో శారద జీవితానికి చిలువలు, పలువలూ కల్పిస్తారన్న భయం కల్గి , ఆనాటి జీవిత పరిస్తితుల్ని వ్రాసి ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చి ఈ రచన చేసినట్టుగా భుజంగ రావ్ గారు తన ముందు మాటలో తెలిపారు.



1937  లో మద్రాసులో బతకలేక వ్రుద్దుడయిన తన తండ్రి ని తీసుకొని నటరాజన్ తన పన్నెండేళ్ళ వయసులో ఆంధ్రా ప్యారిస్ తెనాలి లో అడుగు పెట్టి తన బావ అయిన భీమారావ్ హోటల్లో పనికి కుదిరి ప్రతిపలంగా ఇచ్చే పావులో-ఆర్తో సంపాదనతో ఓ చిన్న వూరింటిని అద్దెకు తీసుకొని తెనాలి లో తన జీవితాన్ని ప్రారంభించాడు. అప్పటికి అతనికి తమిళ సాహిత్యంతో పరిచయముంది. ఇక్కడ తెనాలి తో తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్తితి వచ్చి తెలుగు నేర్చుకొన్నాడు.రోజుకు పదహారు గంటలు అతి దుర్భరమయిన హోటల్ చాకిరీ చేస్తూ సాహిత్యం వైపు ఆకర్షితులయినాడు. 1946 లో ప్రజాశక్తి లో "ఎస్.నటరాజన్ " పేరిట " ప్రపంచానికి జబ్బు చేసింది" అన్న ఓ వ్యంగ్య రచన ప్రచురితమయ్యింది. ఇదే అతడి అచ్చయిన మొదటి రచన. మిత్రులతో కలిసి "ప్రజావాణి" అనే రాత పత్రిక ను ప్రారంభించాడు. 1946 -47 లలో  నటరాజన్ తన సాహిత్య పరిజ్ఞ్యానాన్ని విషయ పరిజ్ఞ్యానాన్ని పెంచుకొన్నాడు. అదే రోజుల్లో ఆలపాటి రవీంద్రనాథ్ చౌదరి తెనాలి లో "జ్యోతి" అనే పక్ష పత్రిక ప్రారంభించారు. ఈ పత్రిక కారణంగా తెనాలి ఓ సాహిత్య కేంద్రంగా వెలసిన్దంటారు.అంతక్రితమే చక్రపాణి "యువ" కూడా తెనాలి నుంచే ప్రారంభించారు.1948  సం.జనవరి ౩౦ వ తారీకు జ్యోతి పత్రికలో " గొప్పవాడి భార్య" అనే ఒక వ్యంగ్య రచన శారద పేరున అచ్చయ్యింది, శారద పేరున అచ్చయిన మొదటి రచన ఇదే. నటరాజన్ సహజంగా సౌందర్యోపాసట అందుకే "శారద" అన్న మూడక్షరాల స్త్రీ నామం తనకు నచ్చి దాన్నే కలం పేరుగా పెట్టుకొన్నాడట. అక్కడి నించి శారద శర పరంపరలుగా రచించాడు. తను చూచిన ఎందరో అభాగ్యజీవుల్ని , దురాశాపరుల్నీ తన సాహిత్యంలో చిరస్మరనీయంగా చిత్రించాడు. ఇలా  సుమారు ఓ వంద కథలూ, కొన్ని నవలలూ రాశాడు. అతని కథలు విరివిగా ప్రచురితమయ్యి  పేరు సంపాదించే రోజుల్లో కూడా పొట్ట పోసుకోవతందుకు బస్ స్టాండ్లో పాత పుస్తకాలూ , చల్లని మజ్జిగా అమ్మే వాడు.ఇలా చివరి క్షణం వరకూ కష్టపడే బ్రతికాడు. కస్టపడి బ్రతికే మానవుల జీవితాల్ని తన రచనల్లో చిత్రించాడు.

 కథ గురించి శారద ఎం చెప్పాడట అంటే " కథకుడు ఎ చిత్రాన్నయినా సమగ్రంగా చిత్రించాలి, కథ చెప్పడంకూడదు, కథని కెమెరా సినిమాని చూపించినట్లు  చూపించాలనేవాడు.కథ చెప్పడం నాయనమ్మ పని అని , రచయిత తన ఆదర్శాన్ని ఊక దంపుడు ఉపన్యాసంగా చెప్పడాన్ని అంగీకరించేవాడు కాదు.కథలలో గానీ, నవలలో గానీ మనం చెప్పదలచుకున్న ఆదర్శం పూసలలో దారంలా ఉండాలంటాడు . కథ సాంతం చదివేసరికి పాటకుడు మన ఆదర్శాన్ని అంగీకరించే స్థితి కి రావాలంటాడు.ఆదర్శాన్ని విడిగా చెప్పడం అతడికి నచ్చదు. కథాకతనంలోనే తానూ చెప్పదల్చుకున్నది ఇమిడి ఉండాలి , ఆదర్శామూ రావాలి అనేవాడట.  

ఇలా  తెనాలి లో అడుగుపెట్టి హోటల్ వర్కర్ గా పనిచేస్తూ పర భాష అయిన తెలుగు నేర్చుకొని ఆకలి, దారిద్ర్యం ,కన్నీళ్ళ గురించి  తన కలం నుంచి ఎన్నో రచనలు చేస్తూ  , తండ్రి మరణంతో వచ్చిన మూర్చ వ్యాధి జీవితాంతం వెన్నంటి చివరికి ఆ మూర్చ తోనే జీవితం ముగించిన శారద జీవితం గురించి ఎన్నో విషయాలు, శారద వ్యక్తిత్వం గురించి , రచయిత ఈ రచనలో మనతో పంచుకుంటారు. శారద జీవితం గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళు తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం.

రచయిత: ఆలూరి భుజంగ రావు.
ప్రచురణ: చైతన్య వేదిక- తెనాలి
వెల      : రూ. ౩౦.౦౦