Friday, October 22, 2010

శాంతినికేతన్ లో తెలుగు వైణిక విద్వాంసుడు



" తన కొనగోటితో నా హృదయాన్ని కరిగించిన విద్వాంసులు తుమరాడ శాస్త్రి గారు, వీరిని నా గురువు గా గుర్తిస్తున్నాను." ఈ మాటలు అన్నది విశ్వకవి రవీంద్ర నాథ్ టాగూరు,  మరి ఆ గురువు ఎవ్వరంటే పిటాపురం ఆస్థాన వైణిక విద్వాంసుడు " తుమరాడ సంగమేశ్వర శాస్త్రి" .  విశ్వ కవి జీవితం లో మన రాష్ట్రానికి సంభందించి రెండు చెప్పుకో దగ్గ సంఘటనలు జరిగాయి. మొదటిది, ఆయన మదనపల్లి లో థియొసోఫికల్ కాలేజ్ లో బస చేసి, తన " జనగణమన " గీతాన్ని వంగ భాష లోంచి ఆంగ్ల భాష లోకి అనువదించారు.  అక్కడినించి అనిబిసెంట్ గారితో కలిసి మద్రాస్ కి వెళ్లి  అక్కడ కలకతా రైలు ఎక్కారట.  ఇక రెండవ విషయానికి  వస్తే, ఆ విశ్వ కవి ఎక్కిన రైలు పిఠాపురం రాజావారు ఆపించి టాగూరు ని మూడు రోజులపాటు పిఠాపురం  ఆస్థానం లో తన అతిధి గా ఆహ్వానించారట.

ఆ మూడు రోజుల మజిలి లో టాగూర్ కి తెలుగు వారి సంగీత సౌరభాల్ని ఆస్వాదించి పరవశించే అవకాశం కలిగింది. ఆ అవకాశం కల్పించిన వైణిక విద్వాంసుడు   "తుమరాడ సంగమేశ్వర శాస్త్రి" గారు . వారు తన వీణానాదం లో వివిధ రాగాలను అలవోకగా, అతి శ్రావ్యంగా, అత్యంత హృద్యంగా వాయించడంతో పరవశించి పోయిన విశ్వకవి, ఆ విద్వాంసుడిని ఆలింగనం చేసుకొని, తన్మయత్వం తో ఆనంద  భాస్పాలు కార్చారు. ఈ సమాగమం ఇక్కడితో ఆగలేదు. విశ్వకవి రాజా వారిని అభ్యర్ధించి ఒప్పించి,  సంగమేశ్వర శాస్త్రి ని శాంతి నికేతన్ లో విద్యార్థిని విద్యార్థులకు వీణ మీద శాస్త్రీయ సంగీతం నేర్పించేల చేసారు. కొన్ని బృందాలకు శిక్షణ నిచ్చాక , రాజా వారి కోరిక ప్రకారం శాస్త్రి గారు పిటాపురం తిరిగి రావాల్సివచ్చినప్పటికి , విశ్వకవి  మాత్రం తన  విద్యార్థుల్ని పిటాపురం పంపుతూ వచ్చారట.

అలా శాంతినికేతన్ లో వీణలో శిక్షణ ప్రవేశపెట్టినవాడు మన తెలుగు వాడు. మన తెలుగువాడి ప్రతిభ ను గుర్తించి ఆ శక్తిని ప్రపంచానికి ప్రసరింప జేసిన   వారు  రవీంద్రనాథ్ టాగూర్. విశ్వకవి 150 వ జన్మదినోత్సవ సందర్బంగా సెప్టెంబర్ 28 న విశ్వకవి ప్రదర్శన శాల రైలు , సంస్కృతి మన హైదరాబాద్ వచ్చిన సంగతి మీకందరకూ తెలిసిందే అనుకుంటా. ఇది తెలుగువారికి కొన్ని అపురూప స్మృతులని గుర్తుకు తెస్తుంది.   


2 comments:

తృష్ణ said...

సంగమేశ్వర శాస్త్రి గారు వీణను ఒక ప్రత్యేక పధ్ధతిలో, నిలువుగా పట్టుకుని వాయించేవారట. దానిని "ఊర్ధ్వ పధ్ధతి" అంటారు.

మరో సంగతి, ఆయన వీణానాదానికి ముగ్ధులైన రవీంద్రులు వీణ మీద ఒక పాట కూడా రాసారు. దానిని తెలుగులో "వీణా పాడవోయి...." అని అనువదించారు కూడా. ఆ రోజు సంస్కృతి ఎక్స్ ప్రెస్ చూసి వచ్చి టాగూర్ ఫోటోలు నా బ్లాగులో పెట్టినప్పుడు మీరు వ్యాఖ్య రాసారు గుర్తుంది.

Anonymous said...

:))...even Tagore wanted to trnslate his bengali work into English while he was in Telugu land! That's the power of Telugus. They love english so much :))